Mallikarjun Kharge : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్పృహ కోల్పోయిన ఖర్గే

ఖర్గే అస్వస్థకు గురైన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి...

Mallikarjun Kharge : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. అయితే.. కతువా జిల్లాలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనూహ్య ఘటన జరిగింది. వేదికపై ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అదుపు తప్పి పడబోయారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది, నేతలు ఆయన పడిపోకుండా అడ్డుకున్నారు. వెంటనే నీరు తాగించారు. అస్వస్థకు గురైనా ఖర్గే తన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా.. ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను.. అప్పుడే చనిపోను. మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు అలసిపోను. అప్పటివరకు బతికే ఉంటా’’ అని పేర్కొన్నారు.

Mallikarjun Kharge…..

ఖర్గే అస్వస్థకు గురైన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కాంగ్రెస్ అధిష్టానం కశ్మీర్‌ నేతలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రసంగం అనంతరం అధినేతను ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఖర్గే చికిత్స పొందుతున్నారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత ప్రియాంక గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో తొలిదశలో 24 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. తొలి దశలో మొత్తంగా 61 శాతం పోలింగ్ నమోదు అయింది. రెండోవిడత పోలింగ్‌ ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పూర్తైంది. మూడో విడత పోలింగ్‌కు కశ్మీర్ ప్రజలు సంసిద్ధమవుతున్నారు.

Also Read : Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

Leave A Reply

Your Email Id will not be published!