హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నెట్ఫ్లిక్స్ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. నెట్ఫ్లిక్స్ సైతం కార్పొరేట్ కార్యాలయాన్ని ఈ మహా నగరానికి మార్చుకోవాలని కోరారు. గురువారం హైదరాబాద్లో అతిపెద్ద నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుందన్నారు.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకున్నందుకు నెట్ ఫ్లిక్స్ ను ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు సీఎం. ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కు రావడం పట్ల మరంత ఆనందంగా ఉందన్నారు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నోకలర్, అక్కడి నుంచి ఈస్ట్మన్ కలర్, తర్వాత 70 ఎంఎం, డాల్బీ, అక్కడి నుంచి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎదిగిందన్నారు. ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ రావాలని ఎప్పుటి నుంచో బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటు కావాలన్నది మా ఆకాంక్ష. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు. మీ పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుందన్నారు.
నెట్ ఫ్లిక్స్ ప్రపంచానికి వినోదం అందించాలని చూస్తోందని అన్నారు. మేం ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నాం అని పేర్కొన్నారు సీఎం. మీకూ మాకు మధ్యన సారూప్యత ఉందన్నారు. నెట్ఫ్లిక్స్, హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని సంస్కృతులను ప్రజలను ఆహ్వానిస్తుందన్నారు. నెట్ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్వేలుగా పని చేయడానికి దోహద పడాలని కోరాడు.
