P Chidambaram : ఆ నాడు ఎమర్జెన్సీ పొరపాటని ఇందిరా గాంధీనే ఒప్పుకున్నారు

తృణమూల్ కాంగ్రెస్ సైతం కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడింది...

P Chidambaram : దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన (1975) జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చెప్పారు. ఇదే సమయంలో ఎమర్జెన్సీ నుంచి పాఠాలు నేర్చుకోకుండా, 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ నాటి తప్పొప్పుల గురించి చర్చించాల్సిన అవసరం ఏముందని బీజేపీని నిలదీశారు. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారేనని గుర్తు చేశారు.

P Chidambaram Comment

”50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ తప్పొప్పుల గురించి ఈరోజు చర్చించాల్సిన అవసరం ఏముంది? గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. గతాన్ని బీజేపీ మరచిపోవాలి” అని చిదంబరం(P Chidambaram) సూచించారు. కాగా, ఎన్డీయే ప్రభుత్వం ‘రాజ్యాంగ హత్యా దినం’గా జూన్ 25న పాటించాలంటూ ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా సీనియర్ నేతలు తప్పుపట్టారు. గత పదేళ్లుగా మీ ప్రభుత్వం (ఎన్డీయే) ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’ను సెలబ్రేట్ చేసుకుంటోందని, దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటూనే ఉందని ఖర్గే విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ సైతం కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ తప్పుపట్టారు. ఇందిరాగాంధీ విమర్శలకు గురై ఒకసారి అధికారం కోల్పోయారని, తిరిగి ప్రధానిగా అధికారంలోకి వచ్చారని గుర్తుచేసారు. ఒక పేజీ చరిత్రను బీజేపీ ఏళ్ల తరబడి వాడుకుంటూ తమ ప్రజావ్యతిరేక విధానాలు, వైపరీత్యాలు, దేశ దుస్థితిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

Also Read : CM Chandrababu : టీడీపీ నాయకులు అన్నే రామకృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మినిస్టర్స్

Leave A Reply

Your Email Id will not be published!