పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తాం : భట్టి విక్రమార్క
వెలుగుమట్ల భూ నిర్వాసితుల కోసం సర్కార్ భరోసా
ఖమ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్ కాలనీ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని, డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచన అని డిప్యూటీ సీఎం అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు 22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసిందన్నారు. చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అని స్పష్టం చేశారు. పేదలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆత్మ గౌరవంతో బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి తరతమ భేదం లేకుండా పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు చెప్పారు.
