#Pantrangam : చారిత్రిక ప్రాధాన్యం ఉన్న పంట్రంగం విర‌సిల్లేదెప్పుడు?

భార‌త దేశ చ‌రిత్ర‌లో సింహ‌పురి అంటేనే ఓ ప్ర‌త్యేకత ఉంది. ఎంద‌రో రాజులు మ‌హ‌రాజులు, స‌రాజులు, పాలించిన ఈ నేల న‌ల‌భీమ పాకంలో కూడా పేరెన్నిక‌గ‌న్న‌దే. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌లో నెల్లూరివారి మెస్ అన‌గానే నోరూరించే వంట‌ల‌కూ పేరు.

Pantrangam: భార‌త దేశ చ‌రిత్ర‌లో సింహ‌పురి అంటేనే ఓ ప్ర‌త్యేకత ఉంది. ఎంద‌రో రాజులు మ‌హ‌రాజులు, స‌రాజులు, పాలించిన ఈ నేల న‌ల‌భీమ పాకంలో కూడా పేరెన్నిక‌గ‌న్న‌దే. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌లో నెల్లూరివారి మెస్ అన‌గానే నోరూరించే వంట‌ల‌కూ పేరు. అలాంటి జిల్లాలో గొప్ప చారిత్రక ప్రాశ స్త్యం వున్న గ్రామం పంట్రంగం(Pantrangam).

క్రీ.శ.893లొ ఈ ప్రాంతాన్ని పాలించిన‌ తూర్పు చాళుక్య ప్రభువు గుణగ విజయాదిత్యుని వ‌ద్ద‌ సేనానిగా ప‌నిచేసిన పండరంగడు తన విజయ యాత్రకు సంకేతంగా పంట్రంగంలో శివాలయాన్ని నిర్మించాడు. ఇప్ప‌టికే చాలా వరకు సముద్ర గర్భంలో కలిసి పోయిన ఈ చారిత్రక పట్టణంలో శివాలయం మాత్రం ప్రస్తుతానికి కన్పిస్తాయి. ఈ ప్రాంతంలో పురావస్తుశాఖ వారు శ్రద్ద చూపి తవ్వకాలు జరిపితే… ఎన్నో ఆసక్తికర చారిత్రక విషయాలు వెలుగు చూసే అవకాశం వుందన్న‌ది స్ధానికులు కోరుతున్నారు.

పౌరాణిక ప్రాశస్త్యం :
పులికాడు సముద్ర తీరప్రాంతంలో అర కోటి లింగాలకు లంకాధీశుడైన రావణాసురుడు అను నిత్యమూ పూజలు చేసేవాడని, రావణుని చంపి, అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో రామ‌చంద్ర‌మూర్తి బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణ‌యించుకుని, శివలింగం తెమ్మ త‌న అనుస‌‌రుడు ఆంజనేయుని కైలాసం పంపిస్తాడు. అయితే , అక్కడ శివ‌లింగం విష‌యంలో వినాయ‌కుడితో వాదన ప్ర‌తి వాద‌న‌ల‌కు హనుమంతుడు దిగ‌టంతో లింగం తేవడం ఆలస్యమవుతుంది. ఈలోగా ముహుర్తం మించిపోతుందని గ్రహించిన సీతమ్మ స‌ముద్ర తీరంలో ఉన్న ఇసుకతోనే లింగా కారం చేసి, దీనిని ప్ర‌తిష్టించ‌మ‌ని త‌న భ‌ర్త‌ని కోర‌టంతో రాముల వారు దానిని ప్రతిష్టించారు.

అయితే వినాయ‌కునితో వాగ్వివాదం పూర్తి చేసి, త‌ను కైలాసం నుండి శివలింగాన్ని తెచ్చిన హనుమంతుడు అక్క‌డ ఉన్న శివ‌లింగం చూస్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. తీవ్ర‌ కోపంతో రాముడు ప్ర‌తిష్టించిన‌ఇసుక లింగాన్ని పెకిలించాలని చూసినా వీలు కాక పోవ‌టంతో త‌ను తెల‌చ్చిన శివ లింగాన్ని ఏం చేస్తార‌ని రాముడిని ప్ర‌శ్నిస్తాడు. దీంతో రాముడు హనుమంతుడ్ని ఓదార్చి, తన భక్తుడు తెచ్చిన లింగాన్ని కూడా ఇసుక‌తో చేసిన శివ‌లింగం పక్కనే ప్రతిష్టించాడు. అందుకే పంట్రంగంలో రెండు గర్భగుడులున్నాయని స్ధానికులు చెప్పే మాట‌. ఈ లింగాల‌ను రామలింగేశ్వరుడు, పండ రంగేశ్వరుడూ అనే పేర్లతో పిలుచుకుంటారు. ఈనాటికీ సూర్యోదయం వేళలో ఈ లింగాల పై సూర్య కిరణాలు పడటం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. ఈ ఆలయం నుండి కాశీలోని విశ్వేశ్వరాలయం వరకు సొరంగం వుంద‌ని అది స‌ముద్ర గ‌ర్భంలో ఉంటంతో ఎవ‌రూ వెళ్లేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు సాహ‌సించ‌లేద‌ని స్ధానికులు న‌మ్ముతారు.

చారిత్రక ప్రాశస్త్యం :
క్రీ.శ.843 న ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజయిన గణగ విజయా దిత్యుడు ఉత్తరాదిన కళింగ మ‌హా సామ్రాజ్యం వ‌ర‌కు అనేక రాజ్యాల‌ను జయించాడు. ఈ క్ర‌మంలో రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునితో అనేక సార్లు యుద్ధాలు చేసాడు. ఈ రాష్ట్రకూట రాజుకు గాంగులు సహాయపడినా విజ‌యం మాత్రం విజయాదిత్యుడు ప‌ర‌మైంది. దీంతో గాంగులతో పాటు రెండ కృష్ణుడిని సైతం విజ‌యాదిత్యుడు ఓడించాడని నెల్లూరు జిల్లాలో దొరికన ఒక శాసనంలో క‌నిపిస్తుంది.

ఇందులో విజ‌యాదిత్యుని విజ‌యానికి కారణం ఇతనికి సేనాని గా ప‌నిచేసిన పండరంగడని(Pantrangam) చెప్తుండ‌గా… ఒంగోలు సమీపాన ధర్మపురం వద్ద దొరికిన మ‌రో శాసనంలో కూడా పండరంగని గొప్పతనం చెప్పబడింది. అలాగే అద్దంకి వద్ద దొరికన శాసనంలో ‘పాండురంగ’డి గురించి వివ‌రించింది. ఇల‌క‌ ఉదయగిరి సమీపాన వున్న పాండురంగం అనే గ్రామం కూడా ఇతని పేరుమీద వెలి సిందేన‌ని ఆత‌ని పేరుతోనే అక్కడి ఆలయమూ కట్టించార‌ని స్ధానికులు చెపుతున్న మాట‌.

ఇక బంద‌రులో దొరికిన ఒక శాస నంలో గుణగ విజయాదిత్యుడు కిరణపురాన్ని అచలపురాన్ని (కొండపల్లి) నెల్లూరు పురాన్ని జయించినట్లు అందువల్ల అతనికి ‘త్రిపుర మర్త్య మహేశ్వర’ బిరుదు లభించింద‌ని దీని ప్ర‌కారం తూర్పు చాళుక్య రాజ్యం నెల్లూరు వరకు విస్తరించి వుండిందని తెలుస్తోంది.

నెల్లూరుకు పడమర ప్రాంతాల్లో బోయలనే కాకల తీరిన యోధులు పాలించే ప్రాంతాలకు ‘బోయకొట్టాలు’గా పిలుచుకునేవారు. . ఇలాంటివి అప్ప ట్లో పన్నెండు ‘బోయకొట్టాలు’ వుండేవని అందులో ముఖ్య మైనవి కందుకూరు, నెల్లూరు గా స్ధానికులు చెప్పుకునే క‌థ‌నం.

వాస్త‌వానికి గుణగ విజయాదిత్యుడు అధికారంలోకి రాకముందు చాళుక్యులకు బోయలు సామం తులుగా ఉండేవారు. అయితే చాలా ఏళ్లుగా చాళ‌క్యుల‌తో వైరుధ్యాలు ప్ర‌క‌టించుకున్న బోయ‌లు విజయాదిత్యుడు రాజ్యాధికారం చేప ట్టగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే విజయాదిత్యుడు బోయల్ని అణచడానికి పండరంగని సైన్యంతో పంపాడు. కడెయరాజు కొడుకైన పండరంగడు విజయా దిత్యుని సేనాని. గొప్ప శక్తి మంతుడు. దీంతో పండరంగడ్ని నిలవరించడానికి బోయలు కట్టెందుర్గం, నెల్లూరు వద్ద సైన్యాన్ని మోహ రించారు అయితే పండరంగడు త‌న‌దైన యుద్ధ వ్యూహాల‌ను అమ‌లు ప‌ర‌చి కట్టెం దుర్గాన్ని నేలమట్టం చేయ‌టంతో పాటు నెల్లూరు పట్టణాన్నిసైతం ధ్వం సం చేసి పన్నెండు బోయ కొట్టాలపై విజ‌యం అందుకుని వాటిని తిరిగి చాళుక్య రాజ్యంలో కలిపాడు.

నెల్లూరు నుండి తొండ మండలం సరిహద్దుల్లో వున్న పులికాట్టు దాకా తన సైన్యంతో వెళ్ళి, అక్కడ తన విజయాలకు సంకేతంగా పండ్రంగం అనే వూరు నిర్మించ‌డంతో పాటు అక్క‌డ‌ పాండురంగేశ్వరస్వామిని ప్రతిష్టించాడు. అదే ఇప్పటి పంట్రంగంగా మ‌రో క‌థ‌నం ప్రాచూర్య‌లో ఉంది.

చాళుక్యుల తర్వాత చోళుల ఆధీనంలోకి ఈ ప్రాంతం వచ్చింది. తిరయన్‌ అనే రాజు ఈ పట్రంగాన్ని(Pantrangam) పాలించినట్లు తెలుస్తోంది. మొదటి కుళోత్తుంగుని శాసనాలు ఈ ఆలయంలో కన్పిస్తాయి. ఈ శాసనాల్లో ఈ వూరిని భవాద్రికోట పేర్కొన్నారు. రాజరాజ చోళుడు ఈ ఆలయానికి అనేక దానాలు చేయ‌గా, రాజరాజ చోళ పరాంతకుడు ఈ ఆలయానికి అనేక మాన్యాలిచ్చాడు. ముమ్మడి వైదంబ మహారాజు భారీ దీపపు సమ్మెలని స‌మ‌ర్పించాడు. నెల్లూరును ఏలిన విజయ గండ గోపాలుడు కామాక్షి అమ్మవారిని ఆలయంలో ప్రతిష్టించాడు. ఈ విష‌యం ఇక్క‌డ దొరికిన‌ శాసనాల్లో అమ్మ వారిని ‘కామకోటి’ గా పేర్కొన‌టం క‌నిపిస్తుంది. అలాగే ఈ ఆలయంలో పావన వినాయకుని గుడి బ‌హు ప్ర‌ఖ్యాతి పొందింది.

వేసవిలో విడిది కోసం ఈ దీవులకు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేవారని ఆయ‌న పేరుతోనే ఇక్కడి దగ్గర్లో ‘రాయదొరువు’ అనే గ్రామం ఏర్ప‌డిన‌ట్టు చెపుతారు.

ఇక్కడ నివసించే పాకనాటి రెడ్లు ఒకప్పుడు రాయల వారికి తాము సామంతులమని వారు చెప్తుంటారు. వారు మాట్లాడే భాష తెలుగు రాయలసీమ మాండలికమే కావ‌టం విశేషం.

ఇంతటి ప్రాశస్త్యం గల గ్రామానికి ఇప్పటికీ సరయిన దారి ఏర్పాటు లేక పోవ‌టం ఆవేద‌న క‌లిగించేదే. ఇక్క‌డికి చేరుకోవాలంటే సూళ్ళూరుపేట నుండి శ్రీహరికోటకు వెళ్ళేదారిలో అటకాని తిప్ప వద్ద దిగి ఉప్పు కయ్యల్లో, నీళ్ళలో, బండ్ల మీద కాని, ట్రాక్టర్ల మీద గాని పంట్రంగం చేరవచ్చు. మల్లాం నుండి ఆటోలు వెళుతుంటాయి. వెయ్యి ఎకరాల మాన్యం గల ఈ ఆలయం నేటికీ అభివృద్ధికి నోచుకోలేక పోవడం ఆవేదన కల్గిస్తుంది. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

ఎంతో ప్రాధాన్య‌త ఉన్న ఈ స‌ముద్ర తీర‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప‌ర్యాట‌క రంగం కూడా అభివృద్ధి చెందుతుంద‌ని చెపుతున్నారు. మ‌రి ప్ర‌భుత్వం వారి మెర ఏమేర‌కు ఆల‌కిస్తుంద‌న్న‌ది చూడాలి.

No comment allowed please