హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆక్రమణదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎంతటి స్థానంలో ఉన్నా చెరువులను ఆక్రమించు కోవాలని చూస్తే తాట తీస్తామన్నారు. రామచంద్రాపురం చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఏవీ రంగనాథ్. చెరువులోకి మురుగు నీరు చేరకుండా దారి మళ్లించే పైపులైన్ల నిర్మాణానికి బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పారు. వారి స్థలంలో పనులకు ఆటంకం లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఎస్టీపీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చెరువు భూములపై భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ , ఇతర ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న సాంకేతిక పరమైన వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం అని అన్నారు హైడ్రా కమిషనర్. ఈ మేరకు ఉన్నతాధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామన్నారు. హైడ్రా అధికారులు వచ్చారంటే ఇళ్ళు కూల్చివేస్తారని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఏవీ రంగనాథ్. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్ళ విషయంలో హైడ్రా జోక్యం చేసుకోదంటూ స్పష్టం చేశారు. కేవలం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, ఇతర అడ్డంకులను తొలగించి ప్రజలందరికీ మేలు చేయడమే మా లక్ష్యం అని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణలు తొలగించాల్సి వస్తే..ప్రభుత్వం ద్వారా వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, ఇరిగేషన్, బీహెచ్ ఈఎల్ అధికారులతో పాటు.. స్థానిక నాయకులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు. చెరువు చుట్టూ తిరిగి ఇన్లెట్లద్వరా మురుగు నీరు చేరుతున్న విధానాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
