Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది (Road Accident). చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Road Accident – బస్సులో 70 మంది ప్రయాణికులు!
టీఎస్ 34 టీఏ 6354 నంబరు గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 5 గంటలకు బస్సు బయల్దేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తంపై బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
Road Accident – 15 మంది ప్రయాణికులను రక్షించిన పోలీసులు
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ రాధను పోలీసులు రక్షించారు. కండక్టర్కు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. సీఐను చేవెళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read : Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు
