Sidhu Moose Wala : మూసే వాలా కేసులో చీఫ్ షూటర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్..నేపాల్ సరిహద్దులో పట్టివేత
Sidhu Moose Wala : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో పురోగతి చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ – నేపాల్ సరిహద్దులో చీఫ్ షూటర్ ను పోలీసులు పట్టుకున్నారు.
కేంద్ర ఏజెన్సీలు, ఢిల్లీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ ఫలితంగా ఈ అరెస్ట్ జరిగిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన షూటర్ తో పాటు అతడికి సంబంధించిన ఇద్దరు సహచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
పంజాబీ గాయకుడు, రాజకీయవేత్తగా మారిన సిద్దూ మూసే వాలా(Sidhu Moose Wala) చీఫ్ షూటర్ దీపక్ దీపక్ అలియాస్ ముండిని బెంగాల్ – నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో అతి పెద్ద పరిణామమని పేర్కొన్నారు. ముండీతో పాటు కపిల్ పండిట్ , రాజిందర్ లను కూడా అరెస్ట్ చేశామన్నారు గౌరవ్ యాదవ్.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. బొలెరో మాడ్యూల్ లో దీపక్ షూటర్ అని పండిట్ , రాజిందర్ ఆయుధాలు , రహస్య స్థావరాలతో సహా లాజిస్టికల్ సపోర్ట్ అందించారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రముఖ గాయకుడు మూసే వాలా మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని జవ హర్కే గ్రామంలో కాల్చి చంపబడ్డాడు. పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత ఏడాది డిసెంబర్ లో సిద్దూ మూసే వాలా పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్య తనదేనని పేర్కొన్నారు.
Also Read : వేతన సంఘం సిఫారసులకు సీఎం ఓకే