CPM Slams : భారత్ జోడో యాత్ర పబ్లిసిటీ స్టంట్ – సీపీఎం
రాహుల్ గాంధీపై సీపీఎం ఎద్దేవా
CPM Slams : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సారధ్యంలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
ఈ యాత్ర కన్యా కుమారి నుంచి ప్రారంభమైంది. కాశ్మీర్ వరకు కొనసాగుతుంది. మొత్తం 3, 570 కిలోమీటర్ల మేర 150 రోజుల పాటు చేపట్టనున్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ తమిళనాడులో పాదయాత్ర పూర్తి చేసుకుని కేరళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.
అయితే కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ(CPM Slams) రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై నిప్పులు చెరిగింది. ఆయన మోదీపై యుద్దం చేయడం లేదని కేవలం ఎన్నికల , పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నారంటూ మండిపడింది.
కేరళలో 18 రోజుల పాటు జోడో యాత్ర సాగితే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 రోజులు మాత్రమే ఉండడం దారుణమని పేర్కొంది.
బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలతో పోరాడేందుకు విచిత్రమైన మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది సీపీఎం.
ఇదిలా ఉండగా సీపీఎం చేసిన కామెంట్స్ ను తిప్పి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి వామపక్ష పార్టీలు ఎ-టీమ్ గా పని చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది.
దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఓ వ్యంగ్యమైన కార్టూన్ ను కూడా జత చేసింది సీపీఎం. మొత్తంగా నిన్నటి దాకా కలిసి పోరాడతామని ప్రకటించిన ఇరు పార్టీలు ఇప్పుడు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : పశువుల వ్యాధుల కట్టడికి వ్యాక్సిన్ సిద్దం – మోదీ