Rahul Gandhi : గాడి తప్పిన మోదీ పాలన – రాహుల్
భారత్ జోడో పాదయాత్ర పునర్ ప్రారంభం
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి ప్రధాన మంత్రి మోదీని టార్గెట్ చేశారు. ఈ దేశంలో అరాచక పాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు పాదయాత్రను. అక్కడి నుంచి తమళినాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యాత్ర పూర్తయింది.
కర్ణాటకలోని రాయచూరు నుంచి తెలంగాణకు ప్రవేశించింది రాహుల్ యాత్ర. నాలుగు రోజుల విరామం తర్వాత తిరిగి నారాయణపేట జిల్లాలోని కృష్ణా మీదుగా ప్రవేశించారు. గూడె బల్లూరు మీదుగా మక్తల్ , ఎన్మన్ గండ్ల లో గురువారం బస చేస్తారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నా ఇప్పటి వరకు ప్రధాన మంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారిని భారతీయ జనతా పార్టీ శ్రేణులు జేజేలు పలుకుతున్నారంటూ ధ్వజమెత్తారు.
తాజాగా పునర్ ప్రారంభించిన పాదయాత్రలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీరిలో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 16 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. 19 అసెంబ్లీ , 7 పార్లమెంటరీ నియోజకవర్గరాలలో కొనసాగుతుంది.
రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. ఇవాల్టితో యాత్ర 26.7 కిలోమీటర్లు పూర్తవుతుంది. తెలంగాణలో 375 కిలోమీటర్ల మేర నడుస్తారు. వచ్చే నెల నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది భారత్ జోడో యాత్ర.
Also Read : అరుదైన చిత్రాన్ని పంచుకున్న ‘ఖర్గే’