Rema Rajeshwari SP : మునుగోడు కౌంటింగ్ వద్ద 144 సెక్షన్
వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
Rema Rajeshwari SP : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గోదాములో ఉన్న స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను ఓపెన్ చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం ప్రారంభించారు.
మొత్తం 628 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో ఉద్యోగులు, వృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్ ఉన్నాయి. ఓట్ల లెక్కింపునకు సంబంధించి 250 మంది సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 100 మంది ఓట్లను లెక్కించగా 150 మంది ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి(Rema Rajeshwari SP) వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చెప్పారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ ఎత్తున భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 470 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. వీరితో పాటు మూడు కేంద్ర బలగాలు కూడా భద్రతలో నిమగ్నమై ఉన్నాయని వెల్లడించారు ఎస్పీ.
అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు ఉంటేనే తాము అనుమతి ఇస్తున్నామని చెప్పారు రెమా రాజేశ్వరి.
ఎవరు లక్ష్మణ రేఖ దాటినా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఎస్పీ రెమా రాజేశ్వరి. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కూడా ప్రదర్శనలు చేపట్టడాన్ని ఒప్పుకోమన్నారు.
Also Read : రెండు రౌండ్లలో టీఆర్ఎస్..బీజేపీ ఫైట్