Sanjay Raut : సంజ‌య్ రౌత్ కు బెయిల్ మంజూరు

102 రోజుల పాటు జైలులోనే శివ‌సేన నేత‌

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ కు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆయ‌న‌ను ఈడీ అరెస్ట్ చేసి జైలుపాలు చేసింది. 102 రోజుల సుదీర్గ విరామం అనంత‌రం కోర్టు సంజ‌య్ రౌత్(Sanjay Raut) కు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఎంపీ సంజ‌య్ రౌత్ తో పాటు ఆయ‌న అనుచ‌రుడు ప్ర‌వీణ్ రౌత్ కు కూడా ఊర‌ట ల‌భించింది కోర్టులో. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డ్డారంటూ కేసు దాఖ‌లు చేసింది. దీంతో ముంబై లోని ఆర్డ‌ర్ రోడ్ జైల్లో ఉన్నారు ఎంపీ సంజ‌య్ రౌత్.

ఇదిలా ఉండ‌గా శివ‌సేన పార్టీలో చీలిక వ‌చ్చిన స‌మ‌యంలో, ప్ర‌స్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పుడు ఎంపీ సంజ‌య్ రౌత్ త‌న వాయిస్ ను గ‌ట్టిగా వినిపించారు. ఒక ర‌కంగా ఆయ‌న అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. కేంద్రంపై, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌ను టార్గెట్ చేశారు.

బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఆపై అంద‌రూ ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన‌ను వీడినా సంజ‌య్ రౌత్ మాత్రం క‌ష్ట కాలంలో ఉద్ద‌వ్ ఠాక్రేకు అండ‌గా నిలిచారు. త‌న‌ను ఎవ‌రూ ప్ర‌భావితం చేయ‌లేర‌ని, తాను మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే వార‌సుడినంటూ ప్ర‌క‌టించారు.

నిజ‌మైన వార‌సుల‌ను ఎవ‌రూ కొనే ద‌మ్ము ఈ దేశంలో లేద‌ని ప్ర‌క‌టించారు సంజ‌య్ రౌత్. మొత్తంగా సంజ‌య్ రౌత్(Sanjay Raut) బ‌య‌ట‌కు రావ‌డంతో ఉద్ద‌వ్ ఠాక్రే కు ఊపిరి పీల్చుకున్న‌ట్ల‌యింది.

Also Read : తెలంగాణ‌లో ఈడీ..ఐటీ దాడుల క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!