Nitish Kumar : ఒకే దేశం ఒకే విద్యుత్ విధానం – నితీశ్
పిలుపునిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి
Nitish Kumar : దేశ వ్యాప్తంగా ఒకే విద్యుత్ టారిఫ్ (విధానం) ఉండాలని పిలుపునిచ్చారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. పూర్తి పారదర్శకత కోసం రాష్ట్రంలో స్మార్ట్ ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు సీఎం. దేశ వ్యాప్తంగా ఒకే విధమైన విద్యుత్ ఛార్జీలు ఉండాలని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలలో సరైన విద్యుత్ టారిఫ్ లు అమలు చేయడం లేదన్నారు నితీశ్ కుమార్. అందువల్లనే తాను ఒకే దేశం ఒకే విద్యుత్ విధానం ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు మిగతా వాటి కంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు.
రూ. 15,871 కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను నిందించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ కు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎక్కువ రేటుకు విద్యుత్ లభిస్తోందన్నారు.
దేశ సమ్మిళిత వృద్దిలో అన్ని రాష్ట్రాలు చురుకుగా పాల్గొంటున్నాయని చెప్పారు నితీశ్ కుమార్. గతంలో చాలా సార్లు ఒకే దేశం ఒకే విద్యుత్ విధానం అమలులో ఉండాలని చెప్పానన్నారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం, ఒక్కో విధంగా విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు సీఎం.
కేవలం పారదర్శకత కోసమే తాము విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read : ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయి స్టార్ట్