మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వ్యవహరించిన తీరు పట్ల భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సంచలన కామెంట్స్ చేసింది. ఆయన గవర్నర్ పదవికి తగినట్లుగా నడుచు కోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గవర్నర్ కు లక్ష్మణ రేఖ ఉంటుందని దానిని అతిక్రమించడం చట్టాన్ని ధిక్కరించడం తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరాఠా సంక్షోభంపై ఇవాళ కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ పై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు తీర్పుపై గురువారం భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. ఈ మేరకు ధర్మాసనం మందలించినంత మాత్రాన తాను శిక్షించినట్లు అనుకోవడం లేదన్నారు. ఆ సమయంలో తనకు ఏది సరైనదో అదే చేశానని చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అంటూ పేర్కొన్నారు మాజీ గవర్నర్. సుప్రీంకోర్టు అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని భగత్ సింగ్ కోష్యారీ స్పష్టం చేశారు. గత జూన్ లో శివసేన పార్టీలో తిరుగుబాటు మధ్య అసెంబ్లీలో మెజారిటీ నిరూపించు కోవాలని అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఆదేశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై ఆయన వ్యాఖ్యానించేందుకు దాట వేశారు.
ఇదిలా ఉండగా 2019 నుండి ఫిబ్రవరి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా పని చేశారు భగత్ సింగ్ కోష్యారీ. ఆయన వయసు 80 ఏళ్లు. భారతీయ జనతా పార్టీ సభ్యుడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కీలక వ్యక్తిగా ఉన్నారు. చట్ట విరుద్దంగా ప్రవర్తించారంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
