అమరావతి : పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125 జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విగ్రహానికి పూల మాలలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసులో తెలుగు వారికి ఎన్నో అవమానాలు జరిగేవని, వాటిని తాళలేక పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు 1952 అక్టోబర్ 19న మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట వద్ద ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారన్నారు. అదే పట్టుదలతో 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన 15 డిసెంబర్ 1952 రాత్రి చివరి శ్వాస విడిచిపెట్టారని అన్నారు.
ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాముల పట్టుదలను మహాత్మ గాంధీ మెచ్చుకొన లేకుండా ఉండలేక పోయేవారన్నారు. పొట్టి శ్రీరాముల వంటి నాయకులు పది మంది ఉంటే భారతదేశానికి ఏడాదిలోనే స్వాతంత్రం తీసుకు రావొచ్చని అప్పట్లో మహాత్ముడు కొనియాడే వారన్నారు. మహాత్ముని వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందని పొట్టి శ్రీరాములు ఎంతటి పట్టుదల కలిగిన వ్యక్తో అని అన్నారు. హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు విశేష కృషి చేశారన్నారు. దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కోసం కూడా పొట్టి శ్రీరాములు మద్రాసులో ఆమరణ దీక్ష చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. తెలుగు జాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ప్రాణాలు ఆర్పించిన పొట్టి శ్రీరాముల సేవలు భావితరాలకు తెలియాలన్న ఉద్దేశంతో ఆయన వర్ధంతిని ఆత్మార్పణ దినంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు.
