కోదండ రాముడి అనుగ్రహం అన్న ప్రసాద వితరణకు శ్రీకారం
తన జన్మ ధన్యమైందన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుపతి : ఆ దేవ దేవుడి కరుణ కటాక్షం వల్లనే తాను ఈ మహత్ కార్యక్రమాలను ప్రారంభించే అదృష్టం దక్కిందన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఛైర్మెన్ ప్రారంభించారు. గత ఏడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టకు విచ్చేసే భక్తులకు అన్న ప్రసాదాలను నిరంతరంగా అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. సీఎం ఇచ్చిన సూచనల మేరకు అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు జర్మన్ షెడ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిఆరు. అందులో భక్తులు కూర్చుని అన్నప్రసాదాలు స్వీకరించేలా ఏర్పాట్లు చేశామన్నారు.
అంతకు ముందు శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో స్వామి వారిని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు రాగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం టిటిడి ఛైర్మెన్ కు తీర్థ ప్రసాదాలను అందించారు. ఏఫ్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మెన్ పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా, అన్నప్రసాదాల పంపిణీ, కల్యాణాన్ని భక్తులు ఆనందంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.చెరుకూరి శ్రీధర్, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్, జేఈవో వి వీరబ్రహ్మం, సివీఎస్వో కే వి మురళీకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
