తీయని మాటలు కాదు నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్లు
ఒంటరిగా ఉన్నారా అంటూ వచ్చే యాడ్స్ పట్ల జర జాగ్రత్త
హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో వస్తున్న యాప్స్ యాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్లు ఉన్నారని మరిచి పోవద్దని హితవు పలికారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇదని పేర్కొన్నారు సీపీ.
ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని వెల్లడించారు. మాయ మాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని హితవు పలికారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగానే, మీ ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని తెలిపారు. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదామని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్మెయిలింగ్ సెక్స్టార్షన్ కు దిగుతారని హెచ్చరించారు వీసీ సజ్జనార్.
పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం అని అన్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్లైన్లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలని సూచించారు. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరారు.