విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా విశాఖ ఉత్సవం కొనసాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్ను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరపురాని అనుభవం మిగిల్చేలా చేసిందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు , ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ , పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ , తదితరులతో కలిసి హెలికాప్టర్ రైడ్లో ప్రయాణించి నగర అందాలను తిలకించామన్నారు కందుల దుర్గేష్. ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా విశాఖ ఉత్సవ్ను దేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు.
విశాఖ ఉత్సవ్కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ రైడ్తో పాటు పారామోటరింగ్, స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్, కయాకింగ్ వంటి అడ్వెంచర్ సేవలను వినియోగించుకుని విశాఖ అందాలను ఆస్వాదిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా చేపట్టిన కార్నివాల్, జానపద కళారూపాల ప్రదర్శనలు, హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే హెలికాప్టర్ రైడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల ద్వారా విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
