జగన్ రెడ్డివన్నీ పచ్చి అబద్దాలే : పయ్యావుల కేశవ్
టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడింది వాస్తవం
విజయవాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) లడ్డూ కోసం నెయ్యి కొనుగోలును ఒక వాణిజ్య లావాదేవీగా పరిగణించిందని ఆరోపించారు. టీటీడీ నుండి ఎన్డిడిబికి పంపిన నెయ్యి నమూనాలలో జంతువుల కొవ్వులు ఉండే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నారని, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అదే నివేదికను ఉటంకించారని అన్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను మాత్రమే బయట పెట్టారని ఇందులో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు పయ్యావుల కేశవ్.
2022లో మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి పంపిన నెయ్యి నమూనాలలో ఆ వస్తువులో కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొన్నాయని మంత్రి ఆరోపించారు. కానీ గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నివేదికను అణచి వేసిందన్నారు. అంతే కాకుండా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కి పంపిన నమూనాలలో జంతువుల కొవ్వులు ఉండే అవకాశం ఉందని స్పష్టంగా వెల్లడైందన్నారు. దీనినే తమ నాయకుడు, సీఎం చంద్రబాబు ప్రస్తావించారని చెప్పారు పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం నియమించిన బోర్డు నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండరింగ్ నిబంధనలను మార్చి, తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న కంపెనీలకు మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఛార్జిషీట్ ను సమర్పించిన సిట్ నెయ్యి కల్తీ కి సంబంధించి రూ. 240 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొందని స్పష్టం చేశారు పయ్యావుల కేశవ్.
