దావోస్ : ఏపీ ప్రభుత్వం మారుతున్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా అపారమైన మానవ వనరులను ఎలా ఉపయోగించు కోవాలనే దానిపై దృష్టి సారించామని చెప్పారు. యువతకు నైపుణ్యం కల్పించడం, మహిళలను సాధికారత సాధించేలా చేస్తున్నామన్నారు. ఉద్యోగాలు, పోటీతత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధికి శక్తినిచ్చే భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఈ సందర్బంగా ఇండియా ఈక్వాలిటీ మూన్షాట్పై ఉన్నత స్థాయి చర్చలో పాల్గొన్నారు మంత్రి . విద్యలో సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, వనరుల పంపిణీపై దృష్టి సారించడం జరిగిందన్నారు లోకేష్. భారతదేశం జనాభా ప్రయోజనం యువత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను కలిగి ఉంటేనే ఫలితాలను ఇస్తుందన్నారు. భవిష్యత్ మార్పులను ఏపీ ముందుగానే అంచనా వేస్తోందని చెప్పారు. ఉపాధి, ఆవిష్కరణలలో కొలవగల ఫలితాలను అందించడానికి విద్య, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలను సమలేఖనం చేస్తోందని స్పష్టం చేశారు.ప్రధానంగా ఏపీలో ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది యువతకు, మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. పరిశ్రమలకు తగినట్టుగా ఈ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. గ్రామీణ యువత కోసం డిమాండ్ ఆధారిత నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు నారా లోకేష్.
