AP Government: టెన్త్, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు
టెన్త్, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు
టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 9న అన్ని జిల్లా కేంద్రాల్లో అవార్డులు ప్రదానం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఏపీలో అగ్ర స్థానంలో నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభించనున్నారు.
పదో తరగతిలో 500 (83.33 శాతం) పైన మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ప్రతి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన మొత్తం ఆరుగురు పదో తరగతి విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారు. వారిలో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్లో 830, ఆపైన అత్యధిక మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ప్రతి జిల్లాకు 36 మంది చొప్పున ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నారు. అవార్డుకు ఎంపికైన పది, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్తో పాటు రూ. 20వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించి సన్మానించనున్నారు.