వైసీపీ పాలన వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి : పవన్ కళ్యాణ్
వాళ్లది విధ్వంస, విచ్ఛిన్న పాలన మాది దక్షత, దార్శనిక పాలన
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో కూడిన పాలన అందిస్తుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో గత పాలకులు ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేశారని ఆరోపించారు. వారు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని వాపోయారు. మనకున్న పరిమిత వనరులను ఎంత సమర్థవంతంగా వినియోగించు కోవాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ బడ్జెట్ ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం ప్రతి అడుగులో ఈ నాలుగు అంశాలే ఆలంబనగా పీఎం మోదీ మార్గ దర్శనంలో, సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోందని అన్నారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు చేసి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయట పడేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం.
ఒక్క సామాజిక భద్రత పెన్షన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం ఇలా ప్రతి అడుగులో మీరు చేసిన విధ్వంసం దాని వల్ల రాష్ట్రం ఎంత నష్ట పోయింది. ప్రజలకు ఎంత నష్టం జరిగింది. ప్రతి అంశం లెక్కలతో సహా ఉన్నాయని అన్నారు. గత పాలకులు రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు మా మీద వేసి వెళ్లారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్లు, వెండర్లకు వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్లిన అప్పులే 1.35 లక్షల కోట్లు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 25 వేల కోట్లు అప్పులు చెల్లించామని చెప్పారు పవన్ కళ్యాణ్.
