అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా దేశంలోని కోట్లాది మందికి కూలీ దొరకకుండా పోయిందన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆదివారం ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర ఆదివారం విజయనగరం జిల్లాలో చేరింది. బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులు హాజరయ్యారు. 100 రోజుల పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. చేసిన పనికి సైతం వేతనాలు సకాలంలో చెల్లించడం లేదని వాపోయారు. కరువు పని అంటేనే పైసలివ్వరు అనే స్థాయికి పథకాన్ని దిగజార్చినట్లు శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మన్రేగా పథకానికి పీఎం మోడీ తెచ్చిన VB G- RAM G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ చేస్తున్న ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు బొబ్బిలి నియోజక వర్గ ప్రజల మద్దతు కూడగట్టడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలని, కోట్లాది మందికి ఉపాధి దక్కించేలా చూడాలని డిమాండ్ చేశారు .లేకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ఏపీ కీలకం కానుందని హెచ్చరించారు షర్మిలా రెడ్డి.
