DK Aruna Jithendereddy : తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. మంత్రి, పోలీసులు కలిసి అల్లిన ఓ అబద్దపు కట్టుకథ అని పేర్కొన్నారు.
మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీరి వెనుక సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే వారిపై, ప్రశ్నించే వారిపై కావాలని కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు డీకే అరుణ,
జితేందర్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే పోలీసుల అదుపులో ఉన్న వారంతా ఒకప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులేనని స్పష్టం చేశారు. వారితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
సుపారీ ఇవ్వగలిగే శక్తి టీఆర్ఎస్ నాయకులకు తప్ప ఎవరికి అవసరం ఉంటుందని ప్రశ్నించారు. మున్నూరు రవి తమ ఇంటికి రావడం ఇదే మొదటి సారన్నారు.
అతడిపై ఎలాంటి ఆరోపణలు, క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. ఇవాళ మీడియాతో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి ప్లాన్ వేశారని ఆరోపించారు.