AVS : విలక్షణ నటుడు తుత్తి ఎ.వి.ఎస్

AVS Birthday

AVS : తుత్తి పదంతో చిరపరిచితులై, తెలుగు చలనచిత్ర సీమలో ఎ.వి.ఎస్ గా పిలువబడే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (జనవరి 2, 1957 – నవంబర్ 8, 2013) తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రచయిత, రాజకీయ నాయకుడు, మిమిక్రీ కళాకారుడు, జర్నలిస్టు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

ఎ. వి. ఎస్(AVS) గుంటూరు జిల్లా తెనాలిలో 1957, జనవరి 2 న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు జన్మించాడు. వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశాడు. ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దిన్ /ఎం.డి.సౌజన్య రాసిన నాటకాల్లో ఏవీఎస్ నటిస్తుండేవాడు. రసమయి సంస్థను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండే వాడు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించాడు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన ఏవీఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఏవీఎస్ నటించిన ఆఖరి చిత్రం పవిత్ర.

19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారాడు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవీఎస్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఏవీఎస్‌కు 1980లో ఆశాకిరణ్మయి తో వివాహం జరిగింది. తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఎన్టీఆర్ నిర్మించిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లో నటించినప్పటికీ ‘మిస్టర్ పెళ్లాం’ ముందుగా విడుదలైంది. ఈ రెండు సినిమాలకూ బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికే నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. ‘మిస్టర్ పెళ్లాం’ ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది. హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా సుమారు 500 సినిమాల్లో నటించారు. ‘మిస్టర్ పెళ్లాం’లో ‘తుత్తి’ పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది. ‘సూపర్ హీరోస్’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కానూ’, ‘రూమ్‌మేట్స్’, ‘అంకుల్’, ‘కోతిమూక’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రల్లోనూ మెప్పించాడు. మాయలోడు, మేడమ్, ఆమె, శభమస్తు, ఓహో నా పెళ్లంట, ధర్మ చక్రం, మా విడాకులు ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’, ‘కంటే కూతుర్నే కను’, ‘వినోదం’ వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. టీవీ నటుడిగా, వ్యాఖ్యాతగానూ రాణించాడు. ఎ.వి.ఎస్ తన నటన ప్రతిభకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బహుమతులు అందుకున్నాడు. అంకుల్ , ఓరి నీ ప్రేమ బంగారం కానూ అనే రెండు సినిమాలు నిర్మించాడు.

చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను ,చదువు చెప్పిన గురువులను, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైనా స్మరించుకునే వాడు. తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపన పడ్డాడు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాడు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవీఎస్‌ చేసిన కృషి మరువలేనిది. చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్రా ప్యారిస్‌ గొప్పతనాన్ని చాటాడు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నటులు మురళీ మోహన్‌ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అంద జేయడంలో భాగస్వామి అయినాడు. రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఏవీఎస్‌ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశాడు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నాడు.

‘తుత్తి’ మ్యానరిజం చేసిన, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’ వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరాడు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశాడు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లాడు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 500 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరు సంపాదించాడు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు నిర్మించాడు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు.

సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవాడు.

చిన్నబ్బాయి, దాసన్నా , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, పవిత్ర , ఆలస్యం అమృతం, దేనికైనా రేడీ, లక్కీ, తూనీగ తూనీగ, శుభప్రదం, ఝుమ్మంది నాదం, ఆలస్యం అమృతం, బెండు అప్పారావు, కింగ్,యమగోల మళ్ళీ మొదలైంది, మధుమాసం, గొడవ, బంగారం, , సంక్రాంతి, అదిరిందయ్యా చంద్రం, శివశంకర్, వెంకీ, దొంగ దొంగది, ఆయుధం, గంగోత్రి, శివమణి,
విజయం, ఎంత బావుందో, ముత్యం, ఆవారాగాడు, జాబిలమ్మ పెళ్ళి తదితర చిత్రాలలో విభిన్న పాత్రలలో రాణించాడు.

మొదటి సినిమా మిస్టర్ పెళ్ళాం (1993) లో నంది ఉత్తమ హాస్యనటుడు, కోతి మూక చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ కథా రచయితగా, అంకుల్ చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ సహాయ నటులుగా పురస్కారాలు అందుకున్నాడు. పలు సాంస్కృతిక సంఘాల నుంచి అనేక అవార్డులు, ఘన సన్మానాలు పొందాడు. 2008లో ఆయన కుమార్తె దానం చేయడంవల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక, తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించాడు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు. రాజకీయ రంగంపైనా ఆసక్తి ఉండటంతో ఏవిఎస్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొన్నాడు. పార్టీ బలోపేత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. కాలేయం వ్యాధి మళ్ళీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 2013, నవంబరు 8 వ తేదీ రాత్రి కన్ను మూశాడు.

No comment allowed please