RS Praveen Kumar : బీఎస్పీ విజయం చారిత్రక అవసరం
తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బహుజన సమాజ్ పార్టీ విజయం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్క పార్టీ అయినా ప్రస్తావిస్తున్నదా అని ప్రశ్నించారు. ఏ పార్టీ వచ్చినా జనానికి మేలు చేయవని పేర్కొన్నారు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగు పడ్డారని నిలదీశారు. కేవలం ఒకే ఒక్క కుటుంబానికే ఈ రాష్ట్రం పరిమితమైందని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
విద్యా రంగం నాశనమైంది, ఆరోగ్య రంగానికి సుస్తీ చేసింది. మొత్తంగా తెలంగాణ పాలన పడకేసిందని ఆరోపించారు. స్కీంలు, ప్రాజెక్టులు స్కాంలకు మాత్రమే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు అయినా భర్తీ చేశారా అని నిలదీశారు. ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరో వైపు విచారణ నివేదిక సమర్పించకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ నిప్పులు చెరిగారు.
సంబండ వర్ణాలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఆర్ఎస్పీ. లేక పోతే మన బతుకులు ఇంకా ఆగమాగం అవుతాయని హెచ్చరించారు. ఇప్పుడైనా మేలుకోవాలని, ఓటు వజ్రాయుధమని దానిని గుర్తించి పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ వల్లనే రాజ్యాధికారం బహుజనులకు సాధ్యం అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.
Also Read : Udhayanidhi Stalin : సామాజిక న్యాయం అంతిమ లక్ష్యం
