సంపన్నమైన ఎమ్మెల్యేలలో చంద్రబాబు, డీకే శివకుమార్
వెల్లడించిన ప్రముఖ ఎన్నికల వాచ్ సంస్థ ఏడీఆర్
న్యూఢిల్లీ : భారత దేశంలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారి ఆస్తుల వివరాలను ప్రకటించింది ప్రముఖ ఎన్నికల వాచ్ డాగ్ సంస్థ ఏడీఆర్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు విస్తు పోయేలా ఉన్నాయి. ఓ వైపు కోట్లాది మంది ఉపాధికి నోచుకోక ఇబ్బందులు పడుతుంటే మరో వైపు ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు లెక్కకు మించిన ఆస్తులు కలిగి ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఏడీఆర్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 15 మంది అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ , టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన వారు ఉన్నారు.
ఇక ప్రకటించిన టాప్ పదిహేను మంది ఎమ్మెల్యేలలో తొలి స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన పరాగ్ షా నిలిచారు. తన ఆస్తుల విలువ రూ. 3,383 కోట్లుగా ఉందని తెలిపింది. ఇక రెండవ స్థానంలో కర్ణాటకకు చెందిన డిప్యూటీ సీఎం , కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ నిలిచారు. తన ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లు. మూడో స్థానంలో ఇదే రాష్ట్రానికి చెందిన హెచ్. పుట్ట స్వామి గౌడ ఉన్నారు. తన ఆస్తుల విలువ రూ. 1,267 కోట్లు. 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియా కృష్ణా నిలిచారు. తన ఆస్తుల విలువ రూ. 1,136 కోట్లు. 5వ స్థానంలో ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన ఆస్తుల విలువ రూ. 931 కోట్లు ఉండడం విస్తు పోయేలా చేసింది.
ఇదే ఏపీకి చెందిన నారాయణ విద్యా సంస్థల చైర్మన్, మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ నిలిచారు. తన ఆస్తుల విలువ రూ. 824 కోట్లు కాగా తను 6వ స్థానంలో ఉన్నారు. 7వ ప్లేస్ లో ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి ఉన్నారు. తన ఆస్తుల విలువ రూ. 757 కోట్లు, ఇదే రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆస్తుల విలువ రూ. 716 కోట్లు, 9వ స్థానంలో బీజేపీకి చెందిన జయంతి భాయ్ సోమా భాయ్ పటేల్ ఆస్తుల విలువ రూ. 661 కోట్లుగా ఉంది.
ఇక 10వ స్థానంలో నిలిచారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ బి షా ఆస్తుల విలువ రూ. 648 కోట్లు, 11వ స్థానంలో బీజేపీకి చెందిన మురుగేష్ ఆర్ నిరాణి ఆస్తుల విలువ రూ. 593 కోట్లు కాగా ఇదే పార్టీకి చెందిన శివరామ్ ఆస్తుల విలువ రూ. 555 కోట్లు, ఎంటీబీ నాగరాజ్ ఆస్తుల విలువ రూ. 515 కోట్లు, గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఆస్తుల విలువ రూ. 500 కోట్లు, కె. సుధాకర్ ఆస్తుల వాల్యూ రూ. 460 కోట్లుగా ఉందని ఏడీఆర్ వెల్లడించింది.
