అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

కౌలు రైతుల రుణాలకు నిబంధనలు అడ్డు కాకూడదు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు. డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం అన్నారు. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం అని తెలిపారు. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో… డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.

అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోందని చెప్పారు. స్వయంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం ఉంద‌న‌న్నారు. బిలియన్ డాలర్ల కంపెనీకి ఉన్నంత క్రెడిబులిటీ డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని ఆ న‌మ్మ‌కం నిజ‌మైంద‌న్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తాయన్నారు. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందన్నారు సీఎం. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుందన్నారు. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!