అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంతకు ముందు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రత్యేక ఆర్థిక సదస్సు 2026లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఎండీలు, చైర్మన్లతో ముచ్చటించారు. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లారు. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై కోర్సు దిగ్విజయంగా పూర్తి చేశారు అనుముల రేవంత్ రెడ్డి. ఇందులో ప్రపంచంలోని 20 దేశాల నుండి 60 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పూర్తి కాలం కోర్సును చదువుతున్న వారు ఉండగా మరికొందరు స్వల్పకాలిక కోర్సును అభ్యసిస్తున్నారు.
వీరందరితో పాటే స్వల్పకాలిక కోర్సును పూర్తి చేశారు సీఎం. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అసాధారణ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి మాత్రమే కాకుండా, తోటి విద్యార్థుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవడం మరిచి పోలేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు. ఇదంతా భయంకరమైన మంచు తుఫాను నేపథ్యంలో జరిగిందన్నారు సీఎం. ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉండటం, 3 అడుగుల కంటే ఎక్కువ హిమపాతం, చలి గాలులు వీచాయన్నారు. ఈ కార్యక్రమం సమయంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న అద్భుతమైన విజయవంతమైన వ్యక్తులను కూడా కలిశానని తెలిపారు సీఎం. అయితే జనవరి 25 నుండి జనవరి 30 వరకు 6 రోజుల కోర్స్ కాగా, జనవరి 29 నాడే రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చారని మీడియాకు షేర్ చేశారు సీఎం పీఆర్వో.
