కన్నడ నాట గెలుపు దిశగా పయనిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. మొత్తం 224 సీట్లకు గాను ప్రస్తుతం అన్ని సీట్లకు ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించనుంది. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ రికార్డు స్థాయిలో గెలుపు సాధించారు.
ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థిపై 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి మొత్తం 125 సీట్లలో లీడింగ్ లో ఉండగా భారతీయ జనతా పార్టీ 68 సీట్లలో ఆధిక్యంలో ఉంంది. ఇక జేడీఎస్ పార్టీ అభ్యర్థులు 25 సీట్లలో అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇతరులు 7 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో పవర్ లోకి రావాలంటే 113 సీట్లు రావాల్సి ఉంటుంది. మరో వైపు ఎగ్జిట్ పోల్స్ జేడీఎస్ కీలకంగా మారనుందని వెల్లడించాయి. కానీ వాటికి భిన్నంగా ప్రజలు తీర్పు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అప్ గా ఈ ఫలితాలు మారనున్నట్లు తేలి పోయింది. మొత్తంగా ఒంటరిగానే జేడీఎస్ తో పొత్తు లేకుండానే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రానుంది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు సంబురాల్లో మునిగి పోయారు.
