అమరావతి : ఏపీ సర్కార్ మరో కీలకమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు గాను దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా వికలాంగులకు ఇచ్చిన హామీని తాము నెరవేర్చినట్లు తెలిపారు సీఎం.
ఇదిలా ఉండగా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు బస్సులో ప్రయాణం చేశారు. సుమారు 11 కిమీ మేర దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించడం విశేషం. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు. సీఎం క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగ శక్తి పథకం లబ్దిదారులుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ మాటామంతీ నిర్వహించారు.
ఇదిలా ఉండగా క్యాంప్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులను అందరినీ ఆప్యాయంగా పలకరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు సీఎంతో పాటు నారా లోకేష్. ఈ సందర్బంగా తమకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు.
