Delhi CM Order : ఎల్జీ ఆదేశాలు పాటించకండి – సీఎం
ఢిల్లీలో ముదిరిన సక్సేనా వర్సెస్ కేజ్రీవాల్
Delhi CM Order : ఢిల్లీలో ఎల్జీ సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. ఆప్ కు చెందిన అభ్యర్థులే కొలువు తీరారు. కానీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఆరుగురు సభ్యుల ఎంపిక నిలిచి పోయింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు కావడంటూ పేర్కొంది.
నామినేటెడ్ సభ్యులకు ఎలాంటి ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు చేపట్టారు. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Order) సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎవరైనా సరే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జారీ చేసే ఆదేశాలను పట్టించు కోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాము ఏది చెబితే అదే చేయాలని స్పష్టం చేశారు.
జీతాలు ఇస్తున్నది తామేనని ఎల్జీ కాదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఇక నుంచి ఎల్జీ ఆదేశాలను తీసుకోవడం మానేసి ఆయన నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే వారి సంబంధిత మంత్రులకు నివేదించాలని ఆప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య అధికార పార్టీకి , ఎల్జీ ఆఫీసుకు మధ్య కొత్త గొడవను రేకెత్తిస్తోంది.
ఎస్సీ ఆదేశాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్న ఉత్తర్వుల అమలును తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని ఆదేశాలు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నించారు .
Also Read : దాడి వెనుక అమృతపాల్ సింగ్