రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా

నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ క‌విత

హైద‌రాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, మరో వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వెలుగుమ‌ట్ల బాధితుల కోసం చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌ను ఆమె విర‌మించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రజలను క్షమాపణ అడగాలన్నారు
రాజ్యాంగమంటే ఏదో ఒక హారం కాదు. ఈ దేశాన్ని నడిపించే గ్రంథం .పేద ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే మీరు రాజ్యాంగాన్ని పట్టుకోవటం వృథా అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రజాపాలన పేరుతో మీరు ప్రజల‌ను వేద‌న‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు క‌విత‌. అసలు ల్యాండ్ ఓనర్ల ఇళ్లను కూల్చే ఇలాంటి సంఘటనలను మనం ఉపేక్షిస్తే…ప్రైవేట్ ప్రాపర్టీలో కూల్చివేతలకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చినట్లవుతుందన్నారు.ఆ తర్వాత ఇలాంటి సంఘటనలే తెలంగాణ మొత్తం జరుగుతాయని హెచ్చ‌రించారు. ప్రజల ఇళ్లు కూల్చేసిన ప్రభుత్వం నిసిగ్గుగా న్యాయం చేస్తున్నామని చెబుతోందన్నారు. ఇవ్వాళ మంత్రులు 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారని, డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి వచ్చి గృహ ప్రవేశం చేస్తారని భట్టి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

కానీ మీరు ఇచ్చిన టోకెన్ ల పై మాకు ఇంకా అనుమానం ఉందన్నారు. లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించాలని క‌విత డిమాండ్ చేశారు. అలా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని స‌ర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు క‌విత‌. మీరు కూల్చిన ఇళ్లను కొంతమంది పది లక్షలతో కొంతమంది 20 లక్షలతో కొంతమంది 30 లక్షలతో కట్టుకున్నారు. కానీ మీరు మాత్రం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే వారి మిగతా నష్టం ఎవరు భరిస్తారని నిల‌దీశారు.

Leave A Reply

Your Email Id will not be published!