హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమ పురోగతి, అమలు తీరుపై ఆయన సెక్రటేరియట్ నుంచి ఆరోగ్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెక్రటేరియట్ నుంచి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్య శ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ సహా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను హాస్పిటల్స్కు తీసుకు రావడానికి, పరీక్షల అనంతరం వారిని తిరిగి సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని సెర్ప్ సూచించారు. హాస్పిటల్స్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కువసేపు వేచి ఉండే అవసరం లేకుండా అవసరమైన మేర డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులోకి ఉంచుకోవాలని అన్నారు మంత్రి. కుర్చీలు, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. ఒకేరోజు ఎక్కువ మందిని హాస్పిటల్కు తరలించి, వారికి ఇబ్బంది కలిగించొద్దన్నారు. ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్ మెయింటేయిన్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే, వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చికిత్స ప్రారంభించాలన్నారు.
స్క్రీనింగ్ జరిగే అన్ని హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో అవసరమైన మేర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. మహిళల నుంచి రక్త నమూనాల సేకరణ మొదలుకొని.. వాటిని ల్యాబ్లకు చేర్చే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, సాంపిల్స్ దెబ్బ తినకుండా పక్కాగా కోల్డ్ చైన్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలన్నారు. ల్యాబ్లో నమూనాల వివరాలు (డేటా) ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి హెచ్చరించారు. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
