గాడి తప్పిన కాంగ్రెస్ పాల‌న జ‌నం ఆందోళ‌న

హామీల జాత‌ర ఆచ‌ర‌ణ‌కు పాత‌ర పెట్టిన సీఎం

హైద‌రాబాద్ : అడ్డ‌మైన హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ జ‌నం పాలిట శాపంగా మారింద‌ని మండిప‌డ్డారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదన్నారు.అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరపున తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తామ‌న్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాము పెట్టే ఈ బిల్లుకు స‌ర్కార్ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గిట్టుబాటు ధ‌ర లేక అన్న‌దాత‌లు అల్లాడుతున్నార‌ని వాపోయారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత, గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హెచ్చ‌రించారు కేటీఆర్. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపైన ప్ర‌శ్నిస్తామ‌న్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తామ‌న్నారు కేటీఆర్. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీపై ప్రభుత్వాన్ని బ‌రాబ‌ర్ ఎండ గ‌డ‌తామ‌న్నారు. భవిష్యత్తులోనూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. శాసనమండలి, శాసనసభ మధ్య మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్నద‌ని పేర్కొన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపిందని ధ్వ‌జ‌మెత్తారు.

Leave A Reply

Your Email Id will not be published!