మ‌హిళ‌ల సంక్షేమం, భ‌ద్ర‌త‌కు స‌ర్కార్ ప్రాధాన్య‌త

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసుల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగానూ భావించాలని సూచించారు. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురి చేసినప్పుడు నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలని యువతకు హిత‌వు చెప్పారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు సీఎం. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఏ విధంగా స్పందిస్తామో, ఇతర ఆడపిల్లల విషయంలోనూ అదే తీరుగా ఆలోచించాలన్నారు.

జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. Stand With Her క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియ జేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఉమెన్స్ సేఫ్టీ విభాగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో కేవలం కార్యక్రమాల నిర్వహణతో బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. . మహిళను శక్తితో పోల్చుతాం. మహిళలను కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదని అన్నారు. ఈ దుస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించు కోవాల్సిన సమయం వచ్చిందన్నారు సీఎం.

ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోందని చెప్పారు. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర మా పార్టీకి ఉంద‌న్నారు. నాడు తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మహిళల శక్తి సామర్థ్యాల పట్ల ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉందన్నారు రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలే అధికారిణులుగా ఉన్నారని చెప్పారు. ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధించినట్టుగా భావించాలన్నారు.

తెలంగాణలో ఓవైపు మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పారు సీఎం. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నామ‌న్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం అని వెల్ల‌డించారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డనే స్పూర్తిగా ఉండాలని ‘తెలంగాణ తల్లి’ మూర్తులను ప్రతిష్టించుకున్నాం అని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళల ముందడుగే కీలకం అన్నారు సీఎం. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ నెరవేరుతాయ‌న్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవని అన్నారు . కానీ ఈరోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్‌లైన్ క్రైమ్ పెరిగి పోయిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నార‌ని, వీటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటిష్టం చేశామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!