Mumbai Heavy Rain : ముంబైని ముంచెత్తిన వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం
Mumbai Heavy Rain : నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షం తాకిడికి వణుకుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం స్తంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లతో నిండి పోయాయి. వీధులు, రహదారులు నీటితో నిండి పోయాయి.
సియాన్, అంధేరీలో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో నడిచేందుకు వీలు లేకుండా పోయింది. చాలా చోట్ల బస్సుల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రూట్లలో రైళ్లను నిలిపి వేశారు.
వర్ష ఉధృతి రాను రాను పెరుగుతోంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తుగా సూచించింది.
దీంతో కొత్తగా కొలువు తీరిన మరాఠా సర్కార్ అప్రమత్తమైంది. ఆరు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు (రెడ్ అలర్ట్ ) జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఏక్ నాథ్ షిండే ఆదేశించారు.
వర్షాల దెబ్బకు దాదర్ సర్కిల్ , ఫైవ్ గార్డెన్ , హిందూ కాలనీ , చెంబూర్ , వడాల, రఫీ కిడ్వాయి మార్గ్ , తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
థానే, కళ్యాణ్ దిశగా వెళ్లే లోకల్ , ప్యాసింజర్ , మైట్రో రైళ్లను నిలిపి వేశారు. ఇదే సమయంలో భారీ వర్షానికి ముంబై లోని పేడర్ రోడ్ పై కొండ చరియలు విరిగి పడ్డాయి. రహదారిని పూర్తిగా మూసి వేశారు .
ఈసారి కూడా ఎప్పటి లాగే రోడ్లన్నీ జామ్ కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడం మామూలగా మారి పోయింది. బీఎంసీ ఎంత ఖర్చు చేసినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
Also Read : బీజేపీది బూటకపు జాతీయ వాదం