జ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌విత

నీ అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసం

అమరావతి : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అని, ఆయనకు విజన్ లేదు రాష్ట్రం గురించి ఆలోచన లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసి పిలిచినా, జగన్ పారిపోయాడని, నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబు పైనా, కూటమి ప్రభుత్వం పైనా బురద జల్లడం మానుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ఉనికి కోసం, జగన్ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారాంతపు రాజకీయాలు చేస్తూ, కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. ఆయన అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ప్రబుద్ధుడని మండిపడ్డారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. హామీలిచ్చి మడమ తిప్పేసిన చర్రిత ఆయనదన్నారు.

మెగా డీఎస్సీ, సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇలా ఎన్నో హామీలిచ్చి ముఖం తిప్పేశారన్నారు. ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పి జగన్ దంపతులు మోసం చేశారన్నారు. బీసీ బిడ్డలకు రూ.110 కోట్ల డైట్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే ఆ బకాయిలన్నింటినీ చెల్లించిందని గుర్తు చేశారు. కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలను జగన్ పెంచితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, ట్రూడౌన్ పేరుతో ఛార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. జగన్ తండ్రి కంప్యూటర్లు కూడు పెడతాయా..? అని ఆనాడు విమర్శిస్తే… ఈనాడు పిల్లలు కనడమెందుకు…? అని ఆయన అంటున్నారన్నారు. చంద్రబాబు విజన్ వల్లే నేడు ఐటీలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. జనాభా భారం కాదు…భాగ్యం… అని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నమ్మిన సిద్ధాంతమన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!