ఢిల్లీ : శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో సీనియర్ సిటిజన్ల గురించి గళం విప్పాడు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ను చంపేయాలని అన్నాడు. దేశాన్ని నిర్మించిన ఈ ప్రజల వైపు ప్రభుత్వం చూడకపోతే వారిని చంపేయడమే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాల పద్దతిన రుణాలు ఇవ్వరని, డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా ఇవ్వక పోవడం దారుణమన్నారు. అంతే కాదు బతికేందుకు ఇతరులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
రైలు, విమానం ప్రయాణలలో ఇంతకు ముందు ఇచ్చిన 50% రాయతీలు కూడా నిలిపి వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అంతవరకు ఉద్యోగాలలో పన్నులు కట్టిన వారే కదా , అదే రాజకీయాలలో ఉన్న సీనియర్ సిటిజన్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులు, పీఎం, సీఎంలుగా ఉన్న వారికి ఎందుకు అన్ని సౌకర్యాలను, వసతులను కల్పిస్తున్నారంటూ ప్రశ్నించారు ఎంపీ సంజయ్ రౌత్.
సీనియర్ సిటిజన్లను బలహీనులుగా చూడవద్దని కోరారు. వారికి ఓటు హక్కు ఉందని మరిచి పోవద్దన్నాడు. ప్రభుత్వాలను మార్చగలరని , వారికి ఉన్న అనుభవంతో ప్రజలను ప్రభావితం చేసేలా వ్యతిరేకంగా ఓటు వేయిస్తే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయని అన్నారు.
ప్రస్తుత కాలంలో తల్లితండ్రులను చూడని పిల్లల సంఖ్యే ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు FD వడ్డీ రేట్లు తగ్గించడంతో వారికి వచ్చే ఆదాయం తగ్గిపోయిందన్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర సర్కార్ ను కోరారు.
