ఏలూరు జిల్లా : కోకో సాగు ద్వారా రైతన్నలకు అత్యధిక ఆదాయం లభిస్తోందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు అచ్చెన్నాయుడు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోందని చెప్పారరు. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్లో విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని అఅన్నారు మంత్రి అచ్చెన్నాయుడు . పనిలో పనిగా రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. కోకో సాగు ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు .కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. కోకో అభివృద్ధితో ఉద్యానవన రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. గతంలో కొలువు తీరిన వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో వ్యవసాయ రంగం మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయిందని, ప్రస్తుతం తాము వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి. తమ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను , పనిముట్టు పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు.
