KTR : కాజీపేట‌కు రైల్వే కోచ్ మాటేంటి

బీజేపీపై నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR : తెలంగాణ‌లో నువ్వా నేనా అనే స్థాయికి చేరుకున్నాయి రాజ‌కీయాలు. ఇంకా ఎన్నిక‌లు రాక‌ముందే మాట‌ల తూటాలు పేలుతున్నాయి. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR).

అంతే కాదు ద‌మ్ముంటే ఏ డాక్ట‌ర్ తో వ‌చ్చినా స‌రే త‌న శాంపిల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. బండి వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య చోటు చేసుకున్న ఈ మాట‌ల యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ త‌రుణంతో తాజాగా మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. వాట్సాప్ యూనివ‌ర్శిటీగా పేరొందిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌చారం త‌ప్ప ప‌ని చేయ‌డం అల‌వాటు లేదంటూ ఆరోపించారు.

ఇవాళ దేశం గ‌ర్వ‌ప‌డేలా తెలంగాణ‌ను తీర్చి దిద్దామ‌ని, ఐటీ, ఫార్మా, రియ‌ల్ రంగంలో హైద‌రాబాద్ దేశానికి కేరాఫ్ గా మారింద‌న్నారు. కానీ దీనిని బీజేపీ గుర్తించ‌డం లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం తెలంగాణ‌కు ఇచ్చిన హామీల‌ను ఎందుకు నెర‌వేర్చ‌డం లేదో చెప్పాలంటూ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.

సొల్లు క‌బుర్లు చెప్ప‌డం మానుకోవాల‌ని ముందు వ‌రంగ‌ల్ జిల్లాకు ఇస్తామ‌న్న కాజిపేట రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా నిల‌దీశారు బీజేపీని. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారంటూ నిల‌దీశారు. నిత్యం త‌మ‌పై ఆరోప‌ణ‌లు గుప్పించే బండి సంజ‌య్ ఎందుకు దీనిపై మాట్లాడ‌టం లేదంటూ మండిప‌డ్డారు కేటీఆర్.

Also Read : తార‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే

Leave A Reply

Your Email Id will not be published!