హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవార ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు బయట ఉండేవాళ్లా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడి మధ్యలో మీరు బలికావద్దని హితవు పలికారు. రెండేళ్లలో తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. తప్పుడు కేసులు పెడుతూ, రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడే అధికారులను వదిలి పెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక మీడియా సంస్థలో వచ్చిన కథనంపై సిట్ విచారణ చేశారన్నారు. మరి ఇంకో మీడియా సంస్థ అంతకంటే దారుణంగా కథనాలు ప్రచురించిందని, మరి ఆ సంస్థపై ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు కేటీఆర్.
కేవలం తెలంగాణ జర్నలిస్టుల మీదనే ప్రతాపం చూపిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు ఈరోజు హాజరయ్యారని. అన్నారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నదని అన్నారు. అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నాడని ఆరోపించారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటాం అని స్పష్టం చేశారు కేటీఆర్. అధికారం అందలం ఎక్కించినా.. రేవంత్ బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్గ్రెస్.. ఒక మంత్రి 20 శాతం, ఇంకో మంత్రి బ్యాగ్మాన్.. రేవంత్ రెడ్డి డబ్బుల సంచి పంపించినట్లు ఉన్నారు అందుకే భట్టి మౌనంగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
