వైసీపీ దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్దికి కృషి చేస్తా
అమరావతి : ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేసే అబద్దాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఆదివారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వెళ్లి ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై కూడా సూచనలు చేశారు.
నియోజకవర్గంలో డ్రైనేజ్, తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ ఇంచార్జీలు ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్–6 హామీలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఇకపోతే టౌన్, రూరల్ అనుబంధ సంఘాల నియామకాలు, అంతర్గతంగా కేఎస్ఎస్ల నియామకం తదితర పార్టీ వ్యవహారాలపై కూడా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య , జిల్లా పార్టీ కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని , కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, దింతకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, చిత్తజల్లు నాగరాము, పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.
