Minister Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌

విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) ఏర్పాటుచేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మధురవాడలోని ఐటీ పార్క్ కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు మంగళవాయిద్యాల మధ్య సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు.

IT Minister Nara Lokesh Starts

ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖను అభివృద్ధి చేస్తాం – మంత్రి నారా లోకేష్

ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన అనంతరం రిషికొండలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇక్కడున్న ఐటీ ప్రొఫెషనల్స్ కు, సీఈవోలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నిజాయతీగా చెప్పాలంటే.. 1990ల్లో లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrabau) గారు సైబర్ టవర్స్ ను నిర్మించారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పైనే పట్టింది. విశాఖకు పదేళ్లకు మించి పట్టదు. అది మా కమిట్ మెంట్. కంపెనీలు తీసుకురావడం వెనుక ఉన్న శ్రమను ప్రజలు గుర్తించాలి. రాజు గారిని మొదటిసారిగా 2017లో కాలిఫోర్నియాలో కలిశాను. ఆ సమయంలోనే మొదలైంది ఈ ప్రయాణం. ఆయనను విశాఖ, ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు నాకు 8 ఏళ్ల సమయం పట్టింది. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ఇతర దేశాలతో పోటీపడుతున్నాం. ఈ కష్టాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు.

ఈ పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదు. మంతెన రామరాజు, ఎన్ఆర్ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్ట్ ను విశాఖపట్నానికి తీసుకురావడంలో ఎంతో కీలకపాత్ర పోషించారు.ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతో మంది కృషి ఉంది. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని. ఇది మా అజెండా. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజలు ఆ విధంగానే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. 94 శాతం సీట్లతో విజయం సాధించాం. సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.

Also Read : Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Leave A Reply

Your Email Id will not be published!