ఖమ్మం జిల్లా : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం పాలేరు నియోజక వర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, రాకాసి తండా, బంధంపల్లిలో విస్తృతంగా పర్యటిచారు. ఖమ్మం జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
అకేరు వరద ప్రభావిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. బీరోలులోని శ్రీరామ లింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు. దమ్మాయిగూడెంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదు కమిటీల ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా ను అందించారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవమే లక్ష్యంగా.. అభివృద్ది, సంక్షేమం అందిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గడిచిన రెండేండ్లలోనే ఒక్క బీరోలు గ్రామానికే రూ.29.92 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. రూ.2.59 కోట్లతో బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు రోడ్డు, రూ.64 లక్షలతో ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు దమ్మాయిగూడెం నుంచి సోలిపురం వరకు రోడ్డు పనులకు, ఐనవోలు బ్రిడ్జి పనులకు రూ. 5.50 కోట్లతో నిధులను కేటాయించినట్లు తెలిపారు. రూ.6.50 కోట్లతో తెడ్డెలపాడు నుంచి బీరోలు వరకు తారురోడ్డు నిర్మాణం, రూ.30 లక్షలతో బీరోలు నుంచి మేడినపల్లి వరకు రోడ్డు, రూ.4.05 కోట్లతో బందంపల్లి నుంచి హుస్నాబాద్ వరకు తారురోడ్డు, రూ.1.87 కోట్లతో బీరోలు నుంచి మేడే పల్లి వరకు తారురోడ్డు నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు.
రూ.5.50 కోట్లతో ఐనవోలు బ్రిడ్జి, రూ.3.20కోట్లతో చౌటుపల్లి – బీరోలు స్లాబ్ కల్వర్ట్, రూ.2. కోట్లతో కూసుమంచి – బీరోలు కల్వర్ట్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ.64 లక్షలతో బీరోలు ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు, రూ.80 లక్షలతో గ్రామ అంతర్గత సీసీ రోడ్లు, రూ.15.50 లక్షలతో అంగన్వాడీ భవనం పనులు ప్రారంభించినట్లు తెలిపారు మంత్రి. బీరోలు పెద్ద చెరువు మరమ్మతులకు రూ.2.05 కోట్లు,
మంచినీటి సరఫరా, పశువైద్య సేవలకు మరో రూ.6 లక్షల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
