అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

క‌నుల పండువ‌గా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.

అనంతరం గోవింద నామ స్మరణలతో మారు మోగుతున్న గిరి శిఖరం పైకి భక్తులతో కలిసి మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, తిరు కళ్యాణ మహోత్సవం తిలకించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల‌య్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ సమన్వయంతో ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఈ దేవాలయాన్ని ఎకో టెంపుల్ టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ శ్రీనివాసగిరి వేంకటేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకోవడం జరిగిందన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, అధికారులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!