గురువు రుణం తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశీప‌తి శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎలా చెబితే అలా ఆడుతున్నాడ‌ని, పాల‌నా ప‌రంగా పూర్తిగా త‌ను కంట్రోల్ త‌ప్పాడ‌ని ఆరోపించారు. ఇవాళ దేశిప‌తి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్న కార్తీక దీపం డైలీ సీరియల్ నడుస్తూనే ఉంటుంద‌న్నారు. త‌ను కావాల‌నే మాజీ మంత్రి హ‌రీశ్ రావును ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌ని మండిప‌డ్డారు. సీఎం ప‌దే ప‌దే తాను న‌ల్ల‌మ‌ల పులి బిడ్డ‌న‌ని చెప్పుకుంటున్నాడ‌ని కానీ ఆయ‌న క‌నీసం పిల్లి కూడా కాదంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని డైవర్షన్, డెమోలిసిషన్‌కు సీఈవోగా పెట్టాలంటూ పేర్కొన్నారు ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్.

రేవంత్ రెడ్డి వలస వాదుల బానిస అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతే కాదు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి చాలా కష్టపడుతున్నాడని ఫైర్ అయ్యారు .తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ..బనకచర్లకు ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ తాను స‌మైక్య‌వాదిన‌ని నిరూపించుకున్నాడ‌ని నిప్పులు చెరిగారు. త‌ను మ‌రో జ‌న్మ ఎత్తినా స‌రే బీఆర్ఎస్ ను ఎదుర్కోవ‌డం త‌న త‌రం కాద‌న్నారు. ఇక‌నైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు దేశిప‌తి శ్రీ‌నివాస్.

రేవంత్ రెడ్డి తెలంగాణ ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని చూస్తున్నాడ‌ని, అందులో భాగంగానే అన్నింటిని మార్చే ప‌నిలో ప‌డ్డాడ‌ని, కానీ చైత‌న్య‌వంత‌మైన స‌మాజం చూస్తూ ఊరుకోద‌ని, త‌న‌ను ఉరికించి త‌రిమేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!