MP Etela Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఎంపీ ఈటెల
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఎంపీ ఈటెల
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం శామీర్పేట నివాసం నుంచి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు ఎంపీ ఈటల రాజేందర్… వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్… తొలుత ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్ తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగియడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీనితో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఈటెలకు ఇదివరకే కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. మరోవైపు ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జూన్ 5 నే విచారణకు రావాల్సిందిగా కేసీఆర్కు కమిషన్ నోటీసులు పంపింది. అయితే సమయం కావాలని కోరడంతో ఈనెల 11కు విచారణకు రావాలని కమిషన్ పేర్కొంది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీనితో ఈనెల 9న కమిషన్ ముందు హరీష్ రావు విచారణకు హాజరుకానున్నారు.