హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల గురించి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కీలక అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను, వాస్తవ పరిస్థితులను ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. ఆరు ప్రధాన అంశాలను ఈ లేఖలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు: రైతుల కష్టాలు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేల ‘రైతు భరోసా’ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. పెట్టుబడి సాయం అందక, సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత, ఉద్యోగుల సమస్యల గురించి ఆలోచించక పోవడం దారుణమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలను నెరవేర్చక పోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు విద్యా కమిషన్ పేరుతో జీతాలు తగ్గిస్తారనే సంకేతాలిచ్చి ఉపాధ్యాయులను సైతం భయాందోళనలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ చీఫ్ . రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించక పోవడం పట్ల అభ్యంతరం తెలిపారు. దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేసిన విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. దాదాపు రూ.12 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలను పెండింగ్లో పెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం మంచి పద్దతి కాదన్నారు.
వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించడమే కాకుండా.. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను సైతం సమయానికి ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు రామచందర్ రావు. స్వయానా ముఖ్యమంత్రి వద్దే ఉన్న మున్సిపల్ శాఖ వైఫల్యంతో రాష్ట్రంలో ప్రజలపై కోతులు, వీధి కుక్కల దాడులు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారడంతో అంటు వ్యాధులు ప్రబలి ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారని, జడ్చర్ల ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనమని అన్నారు బీజేపీ చీఫ్ .ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను పూర్తిగా విస్మరించారని, అందుకే తెలంగాణ ప్రజల గొంతుకగా భారతీయ జనతా పార్టీ ఈ సమస్యలను సీఎం దృష్టికి తెస్తోందని స్పష్టం చేశారు .ఇప్పటికైనా పాలకులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీని చూడాలని, తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
