ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

శ్రీ సత్యసాయి జిల్లా : బాబుతోనే జాబు గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను జగన్ మోసం చేస్తే, టీచర్, పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి మంత్రి నారా లోకేశ్ మాట నిలబెట్టు కున్నారని కొనియాడారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటను నిలబెట్టు కుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం చేశామని, ఉగాది సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగుల శక్తి పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి సవిత అన్నారు.

ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారని మంత్రి సవిత తెలిపారు. 10,060 ఉద్యోగాల భర్తీకి ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్తని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!